హైదరాబాద్ మెట్రో రైలు చార్జీల పెంపు అనివార్యమని ప్రకటించింది
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు త్వరలో భారీ భారం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెట్రోను నడుపుతున్న ఎల్ అండ్ టీ సంస్థ ఇప్పటికే చార్జీల పెంపు అనివార్యమని ప్రకటించింది. సంస్థ గతంలో ఎదుర్కొన్న ఆర్థిక నష్టాలు, కరోనా సమయంలో వచ్చిన తీవ్ర దెబ్బలు, ప్రస్తుత నిర్వహణ వ్యయాల పెరుగుదల టికెట్ ధరలు పెంచాల్సిన అవసరాన్ని తప్పనిసరి చేస్తున్నాయని స్పష్టం చేసింది.
రూ. 6500 కోట్ల నష్టాలు
ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ ప్రకారం, ఇప్పటివరకు దాదాపు రూ.6500 కోట్ల మేర నష్టాలు వాటిల్లాయి. ముఖ్యంగా కోవిడ్-19 సమయంలో ప్రయాణికుల రద్దీ తగ్గిపోవడం, సేవలు నిలిచిపోవడంతో ఆదాయం బాగా పడిపోయిందని సంస్థ తెలిపింది.
అప్పటి ప్రభుత్వం తిరస్కరించడంతో వాయిదా
కోవిడ్ కాలంలోనే టికెట్ ధరలు పెంచాలనే ఆలోచనతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన ఎల్ అండ్ టీ, ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. అయితే, ప్రస్తుతం పరిస్థితులు మారాయి. సంస్థకు ఉన్న ఆర్థిక ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని, టికెట్ ధరల పెంపు తథ్యమని స్పష్టం చేస్తోంది.
బెంగళూరు నిఘా.. హైదరాబాద్లో యోచన
ఇటీవల బెంగళూరులో మెట్రో చార్జీలు సుమారు 44% పెరగడం ఎల్ అండ్ టీ దృష్టిని ఆకర్షించింది. దీన్ని పరిశీలించి హైదరాబాద్లో ఎంత మేరకు పెంచాలో నిర్ణయించేందుకు సంస్థ విశ్లేషణ జరుపుతోంది.
ప్రాథమికంగా కొన్ని డిస్కౌంట్లు తొలగింపు
ఇప్పటికే సంస్థ కొన్ని డిస్కౌంట్లను తొలగించి ప్రయాణికులపై భారం పెంచింది. గతంలో అందుబాటులో ఉన్న రూ.59 హాలిడే సేవర్ కార్డు రద్దు చేయబడింది. అదేవిధంగా, రద్దీ వేళల్లో మెట్రోకార్డు వినియోగదారులకు అందే 10% డిస్కౌంట్ను కూడా తొలగించారు.
మొత్తానికి, ప్రయాణికులపై భారం మరింత పెరగనుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధికారికంగా టికెట్ ధరలు ఎప్పుడు, ఎంత మేర పెరుగుతాయన్న విషయంపై త్వరలో స్పష్టత రావచ్చు.
Post a Comment