శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీపీ సీవీ ఆనంద్
శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీపీ సీవీ ఆనంద్ పలు సూచనలు చేశారు. నగరంలో నిర్వహించే శ్రీరామనవమి శోభాయాత్రకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉందని, ఈ యాత్రను శాంతియుతంగా, ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు.
ఈ నేపథ్యంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం సీతారాంబాగ్లోని ద్రౌపది గార్డెన్లో నిర్వహించబడింది. ఈ సమావేశంలో సీపీ సీవీ ఆనంద్ పాల్గొని పలు సూచనలు చేశారు. 20 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని, షీటీమ్స్, సీసీఎస్, టాస్క్ఫోర్స్ సిబ్బందితో పూర్తిస్థాయిలో నిఘా ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. శోభాయాత్రను డ్రోన్లు, సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణలో ఉంచుతామని తెలిపారు.
యాత్ర మార్గంలో విగ్రహాల ఎత్తు గురించి జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రశాంతంగా జరిగేలా పోలీసులకు సహకరించాలని కోరారు. యాత్రను మధ్యాహ్నం ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా ట్రయల్ రన్ నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. డ్రోన్ల వినియోగానికి ముందస్తు అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు.
పెద్ద శబ్దాలతో డీజే వినియోగించడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్న దృష్ట్యా, సౌండ్ సిస్టంను పరిమితంగా వినియోగించాలని సీపీ సూచించారు. శోభా యాత్ర ప్రశాంతంగా ముగిసేలా వివిధ శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ మాట్లాడుతూ, రోడ్ల మరమ్మతు, లైటింగ్, వసతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
మంగళ్హాట్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు ఓపెన్ టాప్ జీప్లో ప్రయాణిస్తూ యాత్ర మార్గాన్ని పరిశీలించారు. సమన్వయ సమావేశంలో అడిషనల్ సీపీ విక్రం సింగ్ మాన్, జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయల్ డేవిస్, డీసీపీలు, భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి సభ్యులు, ఆర్ అండ్ బీ, విద్యుత్, అగ్నిమాపక శాఖ, ఆర్టీసీ, జలమండలి, ఆర్టీఏ, వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు.
Post a Comment